తాండూరు 15th May (తెలంగాణ వార్త) తాండూరు ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారుల పై అఘాయిత్యాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
నిన్న బషీరాబాద్ మండలంలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటన మరువకముందే, నేడు యాలాల మండలంలో మరో ఫోక్సో కేసు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు ఫోక్సో కేసులు నమోదవ్వడం తాండూరులో భయానక పరిస్థితులకు నిదర్శనంగా మారింది.
ఆశ చూపించి అమాయక చిన్నారులను పాడుబడ్డ ఇళ్లలోకి తీసుకెళ్లి కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న తీరు ప్రజలను షాక్కు గురిచేస్తోంది.
చిన్నారి పసి మొగ్గల జీవితాలను నాశనం చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిర్లక్ష్యం చేయకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై అప్రమత్తంగా ఉండాలని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి.
అలాగే ఆడపిల్లలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న మగ పిల్లలకు కూడా మహిళలను గౌరవించే సంస్కారం, క్రమశిక్షణ నేర్పించడం అవసరమని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
ఈరోజు ఎక్కడో జరిగింది అని ఊరుకోకండి… రేపు మన ఇంట్లో కూడా జరగొచ్చు అంటూ తల్లిదండ్రులకు హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో భయం నెలకొనగా, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం, పోలీస్ శాఖ మరింత దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
